'ఉండిపోరాదే' మూవీ రివ్యూ
Movie Name: Undiporaade
మొదటి నుంచి కూడా తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలు రాజ్యం చేస్తూనే వస్తున్నాయి. ఫీల్ గుడ్ కంటెంట్ వున్న ప్రేమకథలు కాసుల వర్షం కురిపిస్తూనే వున్నాయి. ఈ కారణంగానే ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడానికి కొత్త దర్శకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో ప్రేమకథా చిత్రమే 'ఉండిపోరాదే'. ఈ సినిమాకి దర్శకుడు కొత్త .. నాయకా నాయికలు కొత్త. ఇక కథలో కొత్తదనం ఎంతవరకు వుందన్నది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ రాజమండ్రిలో మొదలవుతుంది. వినోద్ (కేదార్ శంకర్) ఓ మధ్యతరగతి కుటుంబీకుడు. ఆయనకి కూతురంటే ప్రాణం. ఆ అమ్మాయే ఆయన లోకం .. ఆయన సర్వం. ఆయన గారాబం కారణంగా కూతురు హర్షిత చదువు పాడైపోతుందని తల్లి (సత్యకృష్ణన్) భావిస్తుంది. ఆమె ఒత్తిడి కారణంగా హర్షిత (లావణ్య)ను హైదరాబాద్ లోని ఓ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో వినోద్ అయిష్టంగానే చేరుస్తాడు. అదే కాలేజ్ లో .. అదే గ్రూపులో కరీంనగర్ నుంచి వచ్చిన రామ్ (తరుణ్ తేజ్) చేరతాడు. అతనితో హర్షిత స్నేహం ప్రేమగా మారుతుంది. హర్షితతో ప్రేమ ఇతర కుర్రాళ్లతో రామ్ గొడవపడేలా చేస్తుంది. కాలేజ్ ప్రతిష్ఠను ప్రాణంగా భావించే ప్రిన్సిపాల్ శేఖర్ బాబు(అజయ్ ఘోష్)కి ఈ విషయం తెలిసి రామ్ - హర్షితలను నిలదీస్తాడు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? దాని పర్యవసానాలు ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది.
నవీన్ నాయని దర్శకుడిగా ఈ ప్రేమకథను తెరపై ఆవిష్కరించాడు. ఇంటి నిర్మాణానికి ఇటుకపై ఇటుకను ఎలా జాగ్రత్తగా పేర్చుతూ వెళతామో కథా నిర్మాణం కూడా అలాగే జరగాలి. కానీ ఆయన ఇంటర్వెల్ కి ముందు వరకూ పేలవమైన సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. కొన్ని సన్నివేశాలను ఎంతో సహజంగా తెరకెక్కించిన ఆయన, మరికొన్ని సన్నివేశాల్లో, కొంతమంది పాత్రధారులచేత ఎక్స్ ప్రెషన్ తో కూడిన డైలాగ్స్ ను కూడా చెప్పించలేకపోయాడు. నిజానికి సెకండాఫ్ లో మంచి ఎమోషనల్ డ్రామా వుంది. కానీ ఆ దిశగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ బలమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ ను నడిపించలేకపోయాడు. దాంతో ఫస్టాఫ్ ను చూస్తుంటే, స్టేజ్ పై నడిచే డ్రామాలా అనిపిస్తుంది. కాలేజ్ ప్రిన్సిపాల్ గా అజయ్ ఘోష్ పాత్రను మాత్రం బాగా డిజైన్ చేశాడు. ఈ పాత్రే ఈ సినిమాను కొంతవరకూ నిలబెట్టే ప్రయత్నం చేసిందని చెప్పాలి.
నటీనటుల విషయానికొస్తే హీరోగా చేసిన తరుణ్ తేజ్ ఈ పాత్రకి సెట్ కాలేదు. తన పాత్రకి న్యాయం చేయడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేశాడుగానీ, పాత్రలో ఇన్వాల్వ్ అవలేకపోయాడు. దాంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాడు. ఇక కథానాయిక లావణ్య విషయానికొస్తే, హర్షిత పాత్రలో ఇమిడిపోయింది. సరదా సన్నివేశాల్లోను .. ఎమోషనల్ సీన్స్ లోను బాగా చేసింది. క్రమశిక్షణతో స్టూడెంట్స్ ను హడలెత్తించే కాలేజ్ ప్రిన్సిపాల్ గా అజయ్ ఘోష్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లోను ఆయన నటన మెప్పిస్తుంది. ఇక హీరోయిన్ తల్లిదండ్రులుగా సత్య కృష్ణన్ .. కేదార్ శంకర్ .. సూర్య పాత్రల పరిథిలో నటించారు.
సబు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి వనమాలి .. సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించారు. 'నాన్నా నువ్వు నాకు అమ్మైనావా .. మళ్లీ బతికించి బ్రహ్మయినావా' అనే పాట సంగీత సాహిత్యాలపరంగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ లో ట్రిమ్ చేయవలసిన సీన్స్ చాలానే వున్నాయి. హీరోయిన్ తనలోని ఓ లోపాన్ని సరిచేసుకోవడానికి డాక్టర్ ను కలిసే సీన్ ను లేపేస్తే బాగుండేది. కథను పూర్తిస్థాయిలో పకడ్బందీగా సిద్ధం చేసుకోకపోవడం .. కథనాన్ని పట్టుగా నడిపించలేకపోవడం .. కొన్ని పాత్రలకి సరైన నటీనటులను తీసుకోకపోవడం .. కొత్త నటీనటుల నుంచి అవసరమైన అవుట్ పుట్ ను రాబట్టుకోలేకపోవడం ప్రధానమైన లోపాలుగా కనిపిస్తాయి. దర్శకుడి అనుభవలేమి కారణంగా.. ఫస్టాఫ్ అంతా సాదా సీదా సన్నివేశాలను రాసుకోవడం వలన, యూత్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా వాళ్లను కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.