అమర్ నాథ్
పరమ శివుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం కైలాసం నుంచి కదలి వచ్చిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అయితే ఆయన ప్రత్యక్షంగా కొలువైన ప్రదేశం తమకి తెలిసిపోయిందనీ ... అందువలన తామే వచ్చి దర్శించుకుంటామంటూ భక్తులు కొనసాగించే ముక్తి యాత్రే ... అమర్ నాథ్ యాత్ర. శివుడు మంచు కొండలపై నివాసముంటాడు ... అవసరమైతే తానే ఓ మంచుకొండగా మారతాడు ... తన భక్తుడు పిలవడమే ఆలస్యం కాసేపట్లోనే కరిగినీరై చేరుకుంటాడు.
అందుకే ఇక్కడి మంచుకొండల్లో శివుడు ప్రత్యక్షంగా ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. హిమలింగాన్ని దర్శించడం కోసం మరణాన్ని సైతం లెక్కచేయక ప్రయాణమై వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి వచ్చినా మోక్షమే ... రాకపోయినా మోక్షమే అనుకునేవారు కూడా లేకపోలేదు. జమ్ము - శ్రీ నగర్ నుంచి 'పహల్ గామ్' చేరుకొని అక్కడి నుంచి 'అమర్ నాథ్ గుహ'కు దాదాపు 48 కిలోమీటర్లు నడిచి వెళ్లవలసి వుంటుంది.
అప్పటికప్పుడు మారిపోయే వాతావరణం అవాంతరాలను సృష్టిస్తుంటుంది. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతుంటే ఎటు చూసినా పర్వతాలు ... వాటి పైనుంచి ప్రవహించే జలపాతాలు. ప్రయాణ సమయంలో పలుగురాయి నుంచి పర్వతం వరకూ ప్రతిదీ ఒక శివలింగంలా కనిపిస్తుంది ... విశ్వమే ఆయన స్వరూపమని అనిపిస్తుంది. ఇక అమర్ నాథ్ గుహ ఇంతమంది భక్తులను రప్పించుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ లేకపోలేదు.
ఏకాంత సమయంలో శివుడు దగ్గర పార్వతీ దేవి ఒక విషయాన్ని ప్రస్తావించింది. తన శరీరం నశిస్తూ ఉండటానికీ ... ఆయన మాత్రం అలాగే వుండిపోవడానికి కారణమేమిటని అడిగింది. ఆ రహస్యాన్ని చెప్పడం కోసం హిమాలయాలలోని ఓ గుహకి శివుడు ఆమెను తీసుకువెళ్లాడు. ఆ గుహ లోపలి భాగంలో ఒక మాయతెరను సృష్టించి, పార్వతీ దేవికి ఆ 'అమర రహస్యం' చెప్పాడు. అయితే అక్కడి పావురం గుడ్ల లోనుంచి అప్పుడే బయటికి వచ్చిన రెండు పిల్లలు ఆ అమర రహస్యాన్ని విన్నాయి. ఈ కారణంగా ఆ రెండు పావురాలు అమరత్వాన్ని పొందాయని అక్కడివారు చెబుతుంటారు ... జంట పావురాలను చూపిస్తుంటారు.
ఇక పార్వతీ దేవికి అమర రహస్యం చెప్పడానికి తీసుకు వెళుతున్నప్పుడు, శివుడు మిగతా వారినెవరినీ తనతో రానివ్వలేదు. గుహ దగ్గరికి వెళుతోన్న సమయంలో ముందుగా ఆయన నంది వాహనాన్ని ఒక చోట ఆగిపోమ్మని చెప్పాడు. ఆ ప్రదేశం నేడు 'పహల్ గామ్' గా ప్రసిద్ధి చెందింది. అలాగే తన సిగలోని చంద్రుడిని ఆగిపోమ్మన్న ప్రదేశం 'చందన్ వాడీ' గా ... నాగేంద్రుడిని ఆగిపొమ్మన్న ప్రదేశం 'శేష నాగ్' గా ... వినాయకుడిని ఆగిపొమ్మన్న ప్రదేశం 'మహా గణస్' గా ... పంచభూతాలను ఆగిపొమ్మన్న ప్రదేశం 'పంచ్ తరణి' గా ప్రసిద్ధి చెందాయి.
ప్రతియేటా 'శ్రావణ పౌర్ణమి' నాటికి ఇక్కడి హిమలింగం పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహా ద్భుతమైనటు వంటి ఈ మంచు శివలింగాన్ని దర్శించడంతో, అప్పటివరకూ ప్రయాణ పరంగా పడిన కష్టాలన్నీ మంచులానే కరిగిపోతాయి. మంచు మహా శివుడి ఎడబాటు మనసుకి కష్టాన్ని కలిగించినా, అరుదైన ఆ దర్శన భాగ్యాన్ని ... పుణ్య ఫలాన్ని పొందడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.