Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరం బట్టబయలు.. ధ్వంసం చేసిన భద్రతా బలగాలు

Kashmir Terrorist Hideout Destroyed by Security Forces
షార్ట్స్‌లో చూడండి
కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా, ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఒక రహస్య ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి, దానిని ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

కుప్వారా జిల్లా పరిధిలోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొందరు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దీంతో అప్రమత్తమైన బలగాలు నిర్దిష్ట ప్రాంతాన్ని చుట్టుముట్టి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు వినియోగిస్తున్న రహస్య స్థావరం బయటపడింది. వెంటనే బలగాలు ఆ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో కూడా భద్రతా దళాలు నేడు కీలక చర్యలు చేపట్టాయి. ఖైమోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఆపరేషన్లు కొనసాగుతాయని భద్రతా దళాలు స్పష్టం చేశాయి.
Go Back to Shorts
Kashmir
Terrorist hideout
Security forces
Kupwara
Kulgam
Weapons
Ammunition
Counter-terrorism operation
India
Jammu and Kashmir

More Telugu News