Kollywood Director: కోవిడ్ ఎఫెక్ట్: పొట్టకూటి కోసం కిరాణా షాపు పెట్టుకున్న తమిళ దర్శకుడు

  • పలు చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆనంద్
  •  తక్కువ ధరకు సరుకులు విక్రయిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్న దర్శకుడు
  • హ్యపీగా ఉందన్న ఆనంద్
Tamil Nadu Director Opens Grocery Store To Earn Money Amid COVID

కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో బతుకు తెరువు కోసం ఓ తమిళ దర్శకుడు కిరాణాషాపు పెట్టుకున్నాడు.  ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ , మౌనా మజాయ్’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఇప్పుడు కిరాణా దుకాణం పెట్టుకుని బతుకు బండి లాగిస్తున్నాడు. కరోనా భయం, లాక్‌డౌన్ కారణంగా చిత్రసీమ తెరుచుకోకపోవడంతో మరో మార్గం లేక చిన్న కిరాణా షాపు పెట్టుకున్నాడు.

చెన్నైలోని మౌలివాక్కంలో ఓ స్నేహితుడికి చెందిన గదిని అద్దెకు తీసుకుని అందులో షాపు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ నిత్యావసరాలకు ప్రభుత్వ అనుమతి ఉండడంతో ఆనంద్ కిరణా షాపు పెట్టుకున్నాడు. కాగా, ఆనంద్ ప్రస్తుతం ‘తునింతు సీ’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, కరోనా కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది.  

ఆనంద్ సినీ రంగంలోకి ప్రవేశించి పదేళ్లు అయింది. వచ్చే ఏడాది వరకు సినిమా హాళ్లు తెరుచునే అవకాశం లేదని, అందుకనే తాను కిరాణా షాపును ఎంచుకున్నట్టు ఈ సందర్భంగా ఆనంద్ పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యానని, అయితే, లాక్‌డౌన్ సమయంలో కిరణా, ప్రొవిజన్ షాపులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో తాను కూడా షాపు తెరవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. నూనెలు, పప్పులు, బియ్యం సహా నిత్యావసరాలన్నింటినీ విక్రయిస్తున్నట్టు చెప్పాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే విక్రయిస్తున్నానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని దర్శకుడు ఆనంద్ తెలిపాడు.

More Telugu News