Chiranjeevi: చెన్నైలో ఆ ప్రాంతం వైపు అస్సలు వెళ్లేవాడ్ని కాదు: చిరంజీవి

  • హైదరాబాదులో ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి
  • యువ నటులకు ఆశీస్సులు అందించిన మెగాస్టార్
Chiranjeevi tells his early days experiences

విశ్వంత్, సంజయ్ రావు(నటుడు బ్రహ్మాజీ తనయుడు), నిత్యాశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఓ పిట్టకథ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగ్గా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువనటులు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అంటూ ఓ పిట్టకథ చెప్పారు.

"కొన్ని కప్పలు ఓ నిటారుగా ఉన్న పోల్ ఎక్కాలని ప్రయత్నిస్తుంటాయి. కొందరు వాటిని నిరుత్సాహపరుస్తారు. ఆ పోల్ ను సగం వరకు ఎక్కిన కప్పలు వారి నిరుత్సాహకరమైన మాటలు విని కిందికిపడిపోతాయి. మరికొన్ని మరికొంత ఎత్తుకు ఎక్కుతాయి. మీరు అంతవరకు ఎక్కడం గొప్ప... ఇంకేం ఎక్కుతారు అనగానే ఆ మాటలు విని ఆత్మవిశ్వాసం కోల్పోయిన మరికొన్ని కప్పలు కిందపడిపోయాయి. కానీ ఓ కప్ప మాత్రం చివరి వరకు ఎక్కింది. ఆ కప్పను అందరూ మెచ్చుకున్నారు.

అందరూ ఆ కప్పను ఎలా ఎక్కావని అడిగారు. అప్పుడా కప్ప... ఏంటి అడుగుతున్నారు? అంటూ చెవి రిక్కించింది. ఆ కప్పకు చెవుడు అంటూ చిరు అసలు విషయం చెప్పారు. ఇక్కడ చెప్పుకోవాల్సంది ఏంటంటే, ఆ చెవిటి కప్పలాగే నెగిటివ్ మాటలను అస్సలు వినకూడదు. ఆ చెవిటి కప్ప నిరుత్సాహం కలిగించే మాటలు వినలేదు కాబట్టే పోల్ పైవరకు ఎక్కగలిగింది.

నేను కూడా చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో పాండీ బజార్ వైపు అస్సలు వెళ్లేవాడ్ని కాదు. అక్కడంతా నెగెటివ్ వ్యక్తులు ఉండేవాళ్లు. జీవితంలో ఎదగలేక ఫ్రస్ట్రేషన్ కు లోనైన వ్యక్తులు వాళ్లు. వాళ్ల మాటలు వింటే ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోతానేమోనని భయపడేవాడ్ని. ఇప్పుడీ యువ నటులు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు" అంటూ చిరంజీవి ఆశీర్వచనాలు పలికారు.

More Telugu News