Airtel: మరో రూ. 8 వేల కోట్ల బకాయిలు చెల్లించిన ఎయిర్ టెల్!

  • ఏజీఆర్ బకాయిల చెల్లింపులో ముందున్న ఎయిర్ టెల్
  • మొత్తం రూ. 18,004 కోట్ల చెల్లింపు
  • కేంద్రానికి ఇప్పటివరకూ రూ. 23 వేల కోట్లకు పైగా రాబడి
Airtel Pays another Eight Crores to DOT

సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలకు సంబంధించిన మొత్తంలో మరో రూ. 8,004 కోట్లను భారతీ ఎయిర్ టెల్ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం)కు చెల్లించింది. ఎయిర్ టెల్ సంస్థ గత నెల 17న రూ. 10 వేల కోట్లను చెల్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంస్థ చెల్లించిన బకాయిల మొత్తం రూ. 18,004 కోట్లకు చేరింది. డాట్ అంచనాల ప్రకారం, ఎయిర్ టెల్ రూ. 35,586 కోట్లను చెల్లించాల్సి వుంది.

కాగా, ఏజీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత, పలు కంపెనీలు కొంత మొత్తాన్ని చెల్లించి, మిగతా మొత్తం చెల్లింపునకు సమయం అడిగిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ భారతీ ఎయిర్ టెల్ రూ. 18,004 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ. 3,500 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ. 2,197 కోట్లు చెల్లించగా, కేంద్రానికి రూ. 23,701 కోట్ల బకాయి వసూలైనట్లయింది.

More Telugu News