Guntur District: నేను చనిపోయినట్టు ఆ అమ్మాయికి చెప్పద్దు... ఇదే ఆఖరి కోరికంటూ బాలుడి ఆత్మహత్య!

  • గుంటూరు జిల్లాలో ఘటన
  • పనుందని చెప్పి బయటకు వెళ్లి ఉరి
  • సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Youth Sucide in Guntur District

ఆ బాలుడి పేరు మహేశ్. చదువుతున్నది 9వ తరగతి. చిన్న వయసులోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. స్కూల్ లో ఏంజరుగుతుందో తెలుసుకోకుండానే, ఓ టీచర్ బాలుడిని దారుణంగా కొట్టడంతో, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల పరిధిలోని గోగులమూడిలో జరుగగా, పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే...

గ్రామానికి చెందిన చౌటూరి శైలజ, భర్త నుంచి విడిపోయి, కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటూ, టైలరింగ్ ఉపాధితో జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు మహేశ్, ఇక్కడి సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి పని ఉందని బయటకు వెళ్లిన అతను, కావూరి చెరువు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో నిన్న ఉదయం స్థానికులకు కనిపించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించగా, మృతుని వద్ద సూసైడ్ నోట్ లభించింది. తాను బాగా చదువుకుని ఉద్యోగం చేసి అమ్మను చూసుకోవాలని అనుకున్నానని, తనను క్షమించాలని అందులో మహేశ్ రాశాడు. అమ్మతో పాటు తాతయ్య, మామయ్యలను ఉద్దేశిస్తూ, తాను ఎటువంటి తప్పూ చేయలేదని, కానీ తాను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించాడు.

తన వల్ల ఓ అమ్మాయికి చెడ్డ పేరు వచ్చిందని వాపోయాడు. తాను ఆమెను ప్రేమించానని, విషయం తెలుసుకోకుండా తనపై అభాండాలు వేశారని, టచర్ కూడా ఏం జరిగిందో ఆరా తీయకుండా తనను దారుణంగా కొట్టారని రాశాడు. తాను మరణించిన విషయాన్ని ఆమెకు చెప్పవద్దని కోరాడు. ఇదే తన ఆఖరి కోరికని అన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పగా, తన కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యేనని శైలజ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News