Varla Ramaiah: బొత్సకు జెట్టి రామారావు బంధువా? నిజమైన బంధువేనా?: వర్ల రామయ్య

  • విశాఖలో బాబు కాలు పెడితే జెట్టి ఆత్మహత్య చేసుకుంటానన్నారు
  • జెట్టి చరిత్ర చెప్పాలంటే నా సభ్యత అడ్డొస్తోంది
  • అవంతికి ఈ నిష్కంళక జెట్టి రామారావు ఎలా అనుచరుడయ్యాడు? 
TDP Leader comments on Botsa and Avanthi

విశాఖలో చంద్రబాబు కాలు పెడితే ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు జెట్టి రామారావు చరిత్ర గురించి చెప్పాలంటే తనకు సభ్యత సంస్కారాలు అడ్డొస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, బొత్సకు జెట్టి రామారావు బంధువు అని, అవంతి శ్రీనివాస్ కు అనుచరుడు అని అన్నారు.

బొత్సకు ఈయన నిజమైన బంధువా? లేక బొత్సకు సేవలు చేయడం ద్వారా కలుపుకున్న బంధుత్వమా? అని ప్రశ్నించారు. ఆ విషయం బొత్సనే చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఈ నిష్కంళక ప్రజానాయకుడు జెట్టి రామారావు మీకు ఎలా అనుచరుడు? రాజకీయంగా అనుచరుడా? లేక మీరు కూడా ఈయన సేవలు ఏమైనా అందుకున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమై ఉంటుందని, ఇంకా లోతుగా వెళ్లనని అన్నారు.

విశాఖలో చంద్రబాబును అడ్డుకోవాలని ప్రభుత్వమే కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆందోళనకారులను ముందుగానే ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ శాఖ విఫలం చెందిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు తమ హయాంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగిందని, ఆ సమయంలోనే విశాఖ పర్యటనకు వస్తానన్న జగన్ కు అనుమతి ఇవ్వలేదని, ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని నిన్న చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News