BCCI: టీమిండియా-న్యూజిలాండ్ రెండో టెస్టు వేదికపై సెటైర్ వేసిన బీసీసీఐ!

  • ఎల్లుండి నుంచి భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు
  • వేదికగా నిలుస్తున్న హాగ్లే ఓవల్
  • పచ్చికతో కళకళలాడుతున్న పిచ్
BCCI wits on second test venue as pitch lashes with green

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతోంది. టి20 సిరీస్ ను 5-0తో వైట్ వాష్ చేయడం మినహాయిస్తే భారత్ కు మరో విజయం దక్కలేదు. వన్డేల్లో మూడింటికి మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలయ్యారు. తొలి టెస్టులోనూ చేతులెత్తేశారు. వెల్లింగ్టన్ పిచ్ పై పేస్, బౌన్స్ కు దాసోహం అన్నారు.

ఈ నేపథ్యంలో, శనివారం నుంచి జరిగే రెండో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ కు వేదికగా నిలిచే క్రైస్ట్ చర్చ్ హాగ్లే ఓవల్ పిచ్ మరింత పచ్చికతో కళకళలాడుతోంది. దీనిపై బీసీసీఐ సెటైర్ వేసింది. మైదానం ఫొటో ట్విట్టర్ లో పోస్టు చేసి ఇందులో పిచ్ ఎక్కడ ఉందో గుర్తించగలరా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది.

టీమిండియా ఆటగాళ్లకు రెండో టెస్టులో మరిన్ని కష్టాలు తప్పవని కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ ఇప్పటికే హెచ్చరించాడు. అతడు చెప్పినట్టే హాగ్లే ఓవల్ లో మైదానంలోని పచ్చికతో కలిసిపోయిన రీతిలో గ్రీన్ పిచ్ సిద్ధమైంది. ఈ పిచ్ పై మరింత సీమ్ లభించడమే కాదు, బ్యాట్స్ మెన్ పైకి ప్రమాదకరరీతిలో బంతులు దూసుకువచ్చే అవకాశముంది.

More Telugu News