CAA: పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు.. సైన్యాన్ని దింపండి: కేజ్రీవాల్

  • సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య దాడులు
  • ఈశాన్య ఢిల్లీలో 18 మంది చనిపోయారు.. 150 మంది గాయపడ్డారన్న కేజ్రీవాల్
  • అల్లర్లను అదుపులో పెట్టడం పోలీసుల వల్ల కావడం లేదని వ్యాఖ్య
Army Should Be Called In says Arvind Kejriwal

అల్లర్లతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో 18 మంది మృతి చెందారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినప్పటికీ పరిస్థితి భయానకంగానే ఉంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఈశాన్య ఢిల్లీలో 18 మంది చనిపోయారని, 150 మంది గాయపడ్డారని చెప్పారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరుగుతున్న అల్లర్లు, దాడులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదని తెలిపారు. వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సైన్యాన్ని దింపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని చెప్పారు.

మరోవైపు, నిన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ, పరిస్థితి అదుపులోనే ఉందని, సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఆయన తన మాటను మారుస్తూ సైన్యాన్ని దింపాలని కోరటం... ఢిల్లీలో పరిస్థితి చేజారిపోతోందనే సంకేతాలను ఇస్తోంది.

More Telugu News