Donald Trump: భారత్​ కు అపాచీ, ఎంహెచ్​ 60 రోమియో హెలికాప్టర్లు ఇస్తాం: ట్రంప్​

  • ఈ పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా నిలిచిపోతుంది
  • రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి
  • వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతి ఉందని వెల్లడి
trump modi joint media meet at hyderabad house

భారత్ లో తన పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని, ఇండియా– అమెరికా మధ్య సుమారు రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ట్రంప్, మోదీ మీడియాతో మాట్లాడారు. తన భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. ఈ జ్ఞాపకాలను ఎన్నటికీ మర్చిపోలేనని, ఇది రెండు దేశాలకు ఫలవంతమైన పర్యటనగా ఉంటుందని తెలిపారు.

కీలక ఒప్పందాలపై అవగాహన

ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలకమైన ఒప్పందాలపై అవగాహనకు వచ్చామని ట్రంప్ చెప్పారు, 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ పై చర్చించామని, సుమారు రూ.21 వేల కోట్ల (మూడు బిలియన్ డాలర్ల) విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించామన్నారు. భారత్ కు పెద్ద మొత్తంలో సహజ వాయువు (ఎల్ఎన్ జీ) సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు.

ఉగ్రవాదాన్ని కలిసి ఎదుర్కొంటాం

ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ఇరు దేశాల పౌరులకు భద్రత కల్పించుకునే విషయంపైనా చర్చించామని ట్రంప్ చెప్పారు. పరస్పర ప్రయోజనాలను పరిరక్షించుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. పాక్ కేంద్రంగా పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ఆ దేశంతో కలిసి అమెరికా కృషి చేస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద నిరోధం అంశాల్లో అమెరికా, భారత్ తోపాటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో సహకారం కొనసాగుతుందని తెలిపారు.

భారత్– అమెరికా మధ్య ఎన్నో పోలికలున్నాయి

భారత్, అమెరికా దేశాల మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ప్రజాస్వామ్యం, పౌరులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల విషయంలో ఇరు దేశాలు ముందున్నాయని తెలిపారు. సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల చర్చల్లో పురోగతి కనిపిస్తోందని.. త్వరలోనే గొప్ప ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.

హైదరాబాద్ కు ఇవాంక రాక విషయం ప్రస్తావన

ట్రంప్ మాట్లాడేటప్పుడు గతంలో హైదరాబాద్ కు తన కుమార్తె ఇవాంక వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అమెరికా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని, హైదరాబాద్ లో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంక హాజరైందని చెప్పారు.

More Telugu News