CAA: ఢిల్లీ అల్లర్లలో ఏడుకి చేరిన మృతుల సంఖ్య.. మరిన్ని ప్రాంతాల్లో విధ్వంసం

  • ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలు బంద్
  • నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటన
  • దుకాణాలు మూత.. జనమంతా ఇళ్లలోనే..
Fresh violence in northeast Delhi toll rises to seven

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ ఆందోళనల సమయంలో చెలరేగిన హింసలో మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఇందులో ఒకరు పోలీసు హెడ్ కానిస్టేబుల్ కాగా.. ఆరుగురు సాధారణ వ్యక్తులు. ఇక ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఆందోళనకారుల రాళ్ల దాడులు, దుకాణాల విధ్వంసం, పోలీసుల లాఠీ చార్జి కొనసాగుతున్నాయి. దుకాణాలు, టైర్లు తగలబెట్టడంతో పలు ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. పరస్పర దాడుల్లో వందల మందికి గాయాలు అయ్యాయి.

స్కూళ్లు, కాలేజీలు బంద్

ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో స్కూళ్లు, కాలేజీలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు. ఆయా ప్రాంతాల్లోని జనం భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. దుకాణాలన్నీ మూసేశారు. రోడ్లన్నీ ఆందోళనకారులు, పోలీసులతోనే కనిపిస్తున్నాయి. ప్రధానంగా జఫరాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, ఖురేజీ ఖాస్, భజన్ పురా ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య దాడులు సాగుతున్నాయి.

నెల రోజుల పాటు 144 సెక్షన్

ఆందోళనల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. ఇక ఢిల్లీ మెట్రో పింక్ లైన్ పై ఉన్న ఐదు స్టేషన్లను మూసివేశారు.

ఇంత ఉద్రిక్తత ఎప్పుడూ చూడలేదన్న మౌజ్ పూర్ వాసులు

యాంటీ సీఏఏ ఆందోళనలకు కేంద్ర స్థానమైన మౌజ్ పూర్ ప్రాంతానికి చెందినవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 35 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇప్పుడిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News