CAA: ఢిల్లీలో కొనసాగుతున్న సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు

  • ఈశాన్య ఢిల్లీలో నిన్న మొదలైన ఆందోళనలు
  • ఈరోజు తెల్లవారు జాము వరకు అదే పరిస్థితి
  • మౌజ్ పూర్, బ్రహ్మపురి ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఆందోళనకారులు

ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనల నేపథ్యంలో నిన్న అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ  అల్లర్లు ఈరోజు తెల్లవారుజాము వరకు కొనసాగినట్టు పోలీసుల సమాచారం. అర్ధరాత్రి సమయంలో ఓ ఫైరింజన్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టారని, మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఫైరింజన్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్టు సమాచారం.

ఇవాళ ఉదయం మౌజ్ పూర్, బ్రహ్మపురి ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్విన సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 150 మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

మరోపక్క, ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, ఈశాన్య ఢిల్లీ ప్రాంత అధికారులు, ఎమ్మెల్యేలతో అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.  

More Telugu News