South Korea: కరోనా వ్యాప్తి.. దక్షిణ కొరియాలో రెడ్​ అలర్ట్​

  • చైనా తర్వాత ఆ దేశంలో వేగంగా కరోనా వ్యాప్తి 
  • కొత్తగా మరో 161 మందిలో గుర్తింపు
  • ఏడుకు చేరిన మృతుల సంఖ్య
South Korea declares red alert


చైనాలో పుట్టిన కరోనా వైరస్ దక్షిణ కొరియాలో వేగంగా ప్రబలుతోంది. దాంతో ఆ దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సోమవారం ఒక్కరోజే ఆ దేశంలో 161 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు తేలింది. కొరియాలో కరోనా బాధితుల సంఖ్య 763కు చేరింది. వారం వ్యవధిలోనే 700 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

చైనా తర్వాత కరోనా వైరస్ తో అత్యధిక ప్రభావితం అయిన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. ముఖ్యంగా దయెగు సిటీలోని షిన్ చెనోంజి చర్చి ప్రాంతంలో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సోమవారం గుర్తించిన కొత్త కేసుల్లో ఈ ప్రాంతానికి చెందిన వారే 129 మంది ఉండడం గమనార్హం. కరోనాతో కొరియాలో తాజాగా మరో ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది.  

దేశంలో కరోనా వృద్ధిని అడ్డుకునేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయె ఇన్ రెడ్ అలర్ట్ ప్రకటించారు.  స్కూళ్లకు సెలవులను ప్రభుత్వం మరో వారం పొడిగించింది. చైనా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులను రెండు వారాల పాటు నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది.

సామ్ సంగ్ కు దెబ్బ

కరోనా కారణంగా కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్ కంపెనీపై తీవ్ర ప్రభావం పడుతోంది. కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి వైరస్ బారిన పడడంతో సియోల్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గుమి స్మార్ట్ ఫోన్ల ప్లాంట్ లో పనులను సామ్ సాంగ్ నిలిపివేసింది.

More Telugu News