Secunderabad: ‘క్వార్టర్’ బాటిల్ కావాలంటూ కరెంట్ పోల్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

  • సికింద్రాబాద్‌లోని డీమార్ట్ వద్ద ఘటన
  • మద్యం ఇవ్వకుంటే హైటెన్షన్ వైర్లు పట్టుకుంటానని బెదిరింపు
  • మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తింపు
Man climbed street light pole for liquor bottle

క్వార్టర్ బాటిల్ కావాలంటూ ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో సంగీత్ డీమార్ట్ వద్దకు చేరుకున్న అతడు.. అక్కడి విద్యుత్ స్తంభం ఎక్కి మద్యం కావాలని నానా రభస చేశాడు. తనకు క్వార్టర్ బాటిల్ ఇస్తేనే స్తంభం దిగుతానని, లేదంటే హైటెన్షన్ వైర్లు పట్టుకుంటానని బెదిరించాడు.

స్థానికులు ఎంతగా నచ్చజెప్పినా అతడు వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం చూపించడంతో అతడు కిందికి దిగేందుకు అంగీకరించాడు. దీంతో వీధిలైట్లు బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో పోలీసులు అతడిని కిందికి దించారు. కిందికి దిగిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట శ్యాంలాల్‌కు చెందిన ఇజాజ్‌ (35)గా అతడిని గుర్తించారు. ఇటీవల అతడి తలకు గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News