Dog: హైదరాబాద్ లో 50 మందిని కరచిన కుక్క... రేబిస్ ఉందని తేలేడంతో తీవ్ర ఆందోళన!

  • అమీర్ పేటలో ఘటన
  • ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స
  • ఆందోళన అవసరం లేదంటున్న వైద్యులు
Rebis Dog bites 50 people in hyderabad

హైదరాబాద్, అమీర్ పేటలో దాదాపు 50 మందిని కరిచిన కుక్కకు ప్రమాదకర రేబిస్ ఉన్నట్టు వైద్యులు తేల్చడంతో తీవ్ర ఆందోళనలో బాధితులు ఉన్నారు. కుక్కను స్థానికులు కొట్టి చంపగా, దాని రక్త నమూనాలను సేకరించిన జీహెచ్ఎంసీ అధికారులు, దాన్ని పరీక్షించగా, వ్యాధి ఉన్నట్టు తేలింది. ఈ నెల 21న ఇక్కడి ధరమ్ కరమ్ రోడ్డులో రెచ్చిపోయిన కుక్క, మరికొన్ని కుక్కలను కరుస్తూ, వీధిలో కనిపించిన వారందరినీ కరిచింది.

ఈ మొత్తం ఘటనలో 50 మంది వరకూ గాయపడి, అందరూ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రితో పాటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఇంకా పలువురు హాస్పిటల్స్ లోనే ఉన్నారు. ఇంకా కొందరికి చికిత్స జరుగుతూనే ఉంది.

కుక్కకు రేబిస్ ఉందని తేలడంతో, ఇది ఎవరెవరిని కరించిందన్న విషయాన్ని తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వారి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. రేబిస్ సోకితే బాధితులకు అందించాల్సిన చికిత్స, కాల పరిమితిపై ఉన్నత వైద్య వర్గాలతో చర్చిస్తున్నారు. కాగా, కుక్క దాడిలో గాయపడిన వారి పరిస్థితి క్షేమమేనని, ఆందోళన అవసరం లేదని, అందరికీ మెరుగైన చికిత్సను, వ్యాక్సిన్లను అందిస్తున్నామని అధికారులు అంటున్నారు.

More Telugu News