Mahanandi: 20 ఏళ్లుగా ఇసుక తిని బతికేస్తున్న ప్రకాశం జిల్లా వ్యక్తి

  • శివరాత్రి సందర్భంగా మహానందికి వచ్చిన కోటేశ్వరరావు
  • ఆశ్చర్యంగా చూస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్న భక్తులు
  • దుర్గమ్మ తన కోరిక తీరిస్తే ఇసుక తింటానని మొక్కుకున్నట్టు చెప్పిన కోటేశ్వరరావు
prakasam dist Man Eating Sand for 20 Years in

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇసుకే ఆహారంగా బతికేస్తున్నాడు ప్రకాశం జిల్లా కలసపాడుకు చెందిన కోటేశ్వరరావు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నిన్న కర్నూలు జిల్లాలోని మహానందికి వచ్చిన ఆయన ఇసుక తింటూ కనిపించడంతో భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు.

 భక్తులు కొందరు చొరవ తీసుకుని ఇసుక ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ.. తన కోరిక నెరవేరితే ఇసుక తింటానని 20 ఏళ్ల క్రితం విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నానని, కోరిక తీరడంతో అప్పటి నుంచి ఇసుక తింటున్నానని చెప్పుకొచ్చారు. భక్తులు ఎవరైనా దేవుడు ప్రసాదం ఇస్తే తింటానని, లేదంటే ఇసుకే తన ఆహారమని తెలిపారు.

కోటేశ్వరరావు ఇసుకను ఆహారంగా తీసుకుంటుండడంపై స్థానిక వైద్యుడు ఒకరు మాట్లాడుతూ.. ఇసుకలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఉంటాయని చెప్పారు. రోజూ ఇసుకను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అందుకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది చాలా అరుదైన ఘటనగా ఆయన అభివర్ణించారు.

More Telugu News