China: చైనాలో ఆటోమొబైల్ మార్కెట్ పై పంజా విసిరిన కరోనా వైరస్

  • చైనాలో కరోనా కల్లోలం
  • వేల సంఖ్యలో మృతులు
  • దారుణంగా పడిపోయిన కార్ల అమ్మకాలు
  • ఉత్పత్తి నిలిపివేసిన వాహన తయారీ సంస్థలు
China witnesses low car sales due to corona virus scares

కరోనా వైరస్ మనుషుల ప్రాణాలపైనే కాదు వ్యాపారాలపైనా పంజా విసురుతోంది. చైనాలో ఇప్పటికే రెండు వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. 50 వేల మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతేకాదు, కొన్నివారాలుగా చైనాలో ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతోంది. ముఖ్యంగా అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. ఈ సీజన్ లో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ చైనానే. అలాంటిది ఈ సీజన్ లో కేవలం 4,909 కార్లు మాత్రమే విక్రయించారు. గతేడాది ఇదే సీజన్ లో 59,930 కార్లు అమ్మారు. చైనాలో ప్రస్తుత పరిస్థితికి ఈ గణాంకాలే అద్దం పడుతున్నాయి.

కరోనా వైరస్ కు భయపడి షోరూంలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో కొద్దిమంది ధైర్యం చేసి షోరూంలు తెరిచినా వారి వద్ద కార్లు కొనేందుకు వచ్చే కస్టమర్ల సంఖ్య అంతంత మాత్రంగానే  ఉంది. అటు, చైనాలో వాహన తయారీ సంస్థలు కూడా ఉత్పత్తి నిలిపివేశాయి. వాహన విడిభాగాల పరిశ్రమ పైనా కరోనా ప్రభావం తక్కువేమీ లేదు. ప్రపంచదేశాల మార్కెట్లకు వాహనాల స్పేర్ పార్టులు ఎగుమతి చేసే దేశాల్లో చైనా కూడా ఉంది. ఇప్పుడక్కడి నుంచి వాహన విడిభాగాల సరఫరా క్షీణించడంతో అది ఇతర దేశాల మార్కెట్లను కూడా గణనీయంగా దెబ్బతీస్తుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News