Murder: తమ్ముడి భార్యపై కన్నేసి... హత్య చేయించి.. చివరకు కటకటాల వెనక్కు!

  • కర్ణాటకలో నివాసం ఉంటున్న హైదరాబాద్ జంట
  • వరుసకు తమ్ముడి భార్య కోరిక తీర్చలేదని దుర్మార్గం
  • రూ. 15 లక్షలతో హత్యకు డీల్
Murder In Karnataka

తనకు వరుసకు సోదరుడైన వ్యక్తి భార్యపై కన్నేసిన ఓ యువకుడు, అతన్ని చంపాలని నిర్ణయించుకుని, ఓ హంతక ముఠాతో డీల్ కుదుర్చుకుని, హత్య అనంతరం అడ్డంగా దొరికిపోయి, కటకటాల వెనక్కు వెళ్లాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన సత్యప్రసాద్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే, సత్యప్రసాద్, లక్ష్మణ కుమార్ లు వరుసకు అన్నా తమ్ముళ్లు. ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లను వివాహమాడి, ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. ఈ క్రమంలో లక్ష్మణ కుమార్ భార్య శ్రీజపై కన్నేసిన సత్యప్రసాద్, ఆమెను తనతో రావాలని కోరాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో, లక్ష్మణ కుమార్ ను చంపేస్తే గాని, శ్రీజ తన దారికి రాదని నిర్ణయించుకున్నాడు.

అతన్ని హత్య చేస్తే, రూ. 15 లక్షలతో పాటు హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని కూడా ఇస్తానని దినేశ్ అనే కిరాయి హంతకునితో డీల్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని దినేశ్ తన భార్య సవితకు చెప్పగా, ఆమె కూడా ప్లాన్ లో భాగమైంది.

వారి ప్లాన్ లో భాగంగా లక్ష్మణ కుమార్ రోజువారీ దినచర్యలను గమనించిన దినేశ్ ముఠా, 3వ తేదీన మహదేవపుర వంతెన వద్ద అతన్ని చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపారు. ఆపై అతని సొంత అన్న రాజశేఖర్ కు ఫోన్ చేసి, తమ్ముడు హత్య చేయబడ్డాడని చెప్పి, పరారయ్యారు. రాజశేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు సహకరించిన ముఠాను, సూత్రధారుడు సత్యప్రసాద్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. 

More Telugu News