Ayodhya: అయోధ్య రామాలయం నిర్మాణ కమిటీ చీఫ్ గా మోదీ మాజీ కార్యదర్శి... బాబ్రీ కూల్చివేత నిందితుడు ట్రస్ట్ చీఫ్!

  • బుధవారం సమావేశమైన రామజన్మభూమి ట్రస్ట్
  • రామాలయం నిర్మాణ కమిటీ చైర్మన్ గా నృపేంద్ర మిశ్రా
  • అయోధ్య ట్రస్ట్ చీఫ్ గా నృత్య గోపాల్ దాస్
Ayodhya Trust Chief Nrutya Gopal Das

విశ్వ హిందూ పరిషత్ అనుబంధ రామ జన్మభూమి న్యాస్ చీఫ్, బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నృత్య గోపాల్ దాస్ అయోధ్య రామాలయం ట్రస్ట్ కు అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. మరో వీహెచ్పీ సభ్యుడు, చంపత్ రాయ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. బుధవారం సాయంత్రం సమావేశమైన హిందూ మత పెద్దలు, రామాలయం నిర్మాణానికి నేతృత్వం వహించే కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీలో నరేంద్ర మోదీ మాజీ కార్యదర్శి, మాజీ ఐఎఎస్ అధికారి నృపేంద్ర మిశ్రాను దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్టు తెలిపారు.

కాగా, రామాలయం నిర్మాణానికి 15 మంది సభ్యులతో కమిటీని నియమించనున్నట్టు ఈ నెల 5న పార్లమెంట్ కు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశానుసారం వీరి నియామకం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. ఇక తమ తొలి సమావేశంలో ట్రస్ట్, రామాలయం శంకుస్థాపన, పునాది తేదీని నిర్ణయిస్తుందని భావిస్తున్నారు.

వచ్చే నెలలో సమావేశమయ్యే నూతన కమిటీ శంకుస్థాపన తేదీని ఖరారు చేస్తుందని ట్రస్ట్ కు చెందిన విశ్వ ప్రసన్న తీర్థ స్వామి మీడియాకు వెల్లడించారు. ఇదిలావుండగా, ఆలయ కమిటీలో 80 సంవత్సరాలు దాటిన వారినే ఎంపిక చేశారని, సత్తా ఉన్న యువతకు స్థానం లేకుండా పోయిందని హనుమాన్ గర్హి చీఫ్ మంత్ ధర్మందాస్ విమర్శలు గుప్పించారు.

More Telugu News