Kamal Haasan: కమలహాసన్ ‘భారతీయుడు-2’ సెట్స్‌లో దుర్ఘటన.. ముగ్గురి మృతి

  • మృతుల్లో దర్శకుడు శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్
  • 150 అడుగుల పైనుంచి తెగిపడిన క్రేన్
  • మరో పదిమందికి గాయాలు
Three dead in Bharateeyudu 2 sets while shooting in EVP Studio

‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు-2’ సెట్స్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండగా నిన్న రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్‌పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రమాదంపై స్పందించిన కమల్.. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ముగ్గురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారి కన్నవారి కంటే తన బాధ ఎన్నో రెట్లు ఎక్కువని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News