Team India: న్యూజిలాండ్ లో భారత హైకమిషన్ ఇచ్చిన విందులో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లు

  • ఎల్లుండి నుంచి కివీస్ తో టెస్టు సిరీస్
  • భారత క్రికెటర్లను ఆహ్వానించిన హైకమిషన్
  • న్యూజిలాండ్ తో తమకు సత్సంబంధాలున్నాయన్న కోహ్లీ
Team India visits Indian High Commission in Wellington

ఎల్లుండి నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా క్రికెటర్లు వెల్లింగ్టన్ లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడి విందు కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెటర్లు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. ఎప్పుడైనా నెంబర్ వన్ స్థానాన్ని పంచుకోవాల్సి వస్తే అది న్యూజిలాండ్ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు.

గత కొన్నేళ్లుగా టీమిండియా బలమైన జట్టుగా ఎదిగిందని, దాంతో తమను ఓడించేందుకు అనేక జట్లు ఉవ్విళ్లూరుతుండడం సహజమేనని అన్నాడు. న్యూజిలాండ్ కూడా తమను ఓడించాలని ప్రయత్నిస్తుందని, అయితే, వారి గెలుపు కాంక్షలో ఎలాంటి ప్రతీకార ధోరణి ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ మ్యాచ్ జరుగుతుండగా, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో హాయిగా మాట్లాడగలిగానంటే కారణం ఇదేనని తెలిపాడు. కాగా, తామిద్దరి మధ్య దొర్లిన మాటలు క్రికెట్ గురించి కాదని, జీవితానికి సంబంధించినవని కోహ్లీ వెల్లడించాడు.

More Telugu News