Venlkatesh Gowd: గజ్వేల్ బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యకేసు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు!

  • దివ్యతో మూడేళ్ల కిందట వెంకటేశ్ ప్రేమవివాహం!
  • విభేదాలతో ముగిసిన ప్రేమ పెళ్లి
  • దివ్యకు మరొకరితో పెళ్లి నిశ్చయం
  • భరించలేక ఘాతుకానికి తెగించిన వెంకటేశ్
Venkatesh surrenders at Vemulapadu police station

తెలంగాణలో ఓ బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో దివ్య అనే యువతిని వెంకటేశ్ గౌడ్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో నిన్నటి నుంచి పరారీలో ఉన్న వెంకటేశ్ ఎట్టకేలకు వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంకటేశ్ కోసం ఐదు పోలీసు బృందాలు తీవ్రస్థాయిలో గాలింపు జరిపాయి. కాగా, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

మూడేళ్ల కిందట వీరిద్దరికి ప్రేమ వివాహం జరిగిందని సమాచారం. ఈ పెళ్లికి వెంకటేశ్ తల్లిదండ్రులు అంగీకరించకపోగా, పెళ్లి తర్వాత విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అప్పటికి దివ్య మైనర్. విడిపోయిన తర్వాత వెంకటేశ్ వేధిస్తుండడంతో ఆమె తల్లితండ్రులు తమ కుమార్తె జోలికి వెళ్లకుండా వెంకటేశ్ తో హామీ పత్రం రాయించుకున్నారు. కొంతకాలం కిందట దివ్యకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆమెకు వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.

ఈ నెల 26న పెళ్లి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో వెంకటేశ్ తనకు దక్కని దివ్య మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో గొంతుకోసి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్రగాయాలపాలైన దివ్య అక్కడికక్కడే మరణించింది. వేములవాడలో వెంకటేశ్ ఇంటికి తాళం వేసి ఉండడంతో అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పుడతడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది.

More Telugu News