Varla Ramaiah: ఢిల్లీలో ఆయనను కలవద్దని జగన్‌ను విజయసాయిరెడ్డి అడ్డుకున్నారు: వర్ల రామయ్య

  • సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్లారు
  • ఢిల్లీలో జగన్‌ విదేశాంగ మంత్రిని కలవాలనుకున్నారు
  • ఆయన ఓ సిన్సియర్  అధికారి
  • జగన్‌ను అప్పగించాలని కేంద్రానికి రస్‌ అల్ ఖైమా లేఖ రాసింది 
valra ramaiah fires on ycp leaders

ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ వెళ్లారా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మీ సొంత ప్రయోజనాల కోసమే వెళ్లారు. జగన్‌పై ఉన్నవి మామూలు కేసులు కాదు. అందుకే ఆయన కోర్టులో కాలు పెట్టడానికే భయపడుతున్నారు' అని చెప్పారు.

'ఇటీవల ఢిల్లీలో జగన్‌ హోంమంత్రిని కలిసిన తర్వాత విదేశాంగ మంత్రిని కూడా కలవాలని ప్రయత్నించారు. అయితే, ఆయనను ఓ సిన్సియర్  అధికారిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకున్నారు. కాబట్టి  ఆయనను కలవద్దని, ఆయన ముక్కు సూటిగా వెళ్లే మనిషని, తమకు సాయం చేయబోరని జగన్‌ను విజయసాయిరెడ్డి అడ్డుకున్నారు' అని ఆరోపించారు.

'జగన్‌ను అప్పగించాలని కేంద్రానికి రస్‌ అల్ ఖైమా లేఖ రాసినట్లు మా వద్ద సమాచారం ఉంది. తమ డబ్బును వసూలు చేయడంతో పాటు జగన్‌ను కూడా అప్పగించాలన్నది లేఖ సారాంశం. నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?' అని ప్రశ్నించారు.

'అరబ్ దేశాల్లో ఇటువంటి కేసులను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ కేసు గురించి హోం మంత్రి అమిత్‌ షాతో మీరేం చర్చించారో చెప్పాలి. తమను కాపాడాలని ప్రధాని మోదీని జగన్‌ కోరారన్న విషయం నిజమా? కాదా? చెప్పండి. మన రాష్ట్ర భవిష్యత్తు, మీ రాజకీయ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఇవి' అని తెలిపారు.

'రస్‌ అల్ ఖైమా లేఖ రాసిన విషయం నిజమా? కాదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు ఏడు నెలల క్రితం అరెస్టు చేశారు. డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రస్‌ అల్‌ ఖైమా డబ్బును జగన్‌ కంపెనీల్లో పెట్టినట్లు నిమ్మగడ్డ అక్కడి అధికారులకు వెల్లడించారు. అందుకే వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది' అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

More Telugu News