Mobile Bill: మళ్లీ పెరగనున్న సెల్ ఫోన్ బిల్లులు... ఈసారి రెట్టింపు!

  • కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సిన పరిస్థితి
  • వినియోగదారుడి సగటు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం
  • ఈ సంవత్సరం మరోసారి సెల్ ఫోన్ చార్జీలు పెరిగే అవకాశం
Mobile Phone Bills Hike

కేంద్ర ఖజానాకు భారీగా బకాయిలు చెల్లించాల్సివున్న టెలికం కంపెనీలు, చార్జీలు పెంచడం మినహా మరో దారి లేదని భావిస్తున్నాయి. దీంతో మరోసారి సెల్ ఫోన్ బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గత డిసెంబర్ లో 42 శాతం వరకు డేటా చార్జీలను పెంచిన కంపెనీలు, మరింత పెంపునకు సిద్ధం అవుతున్నాయి. ఈ దఫా చార్జీల వడ్డన రెట్టింపు ఉండవచ్చని టెలికం రంగ నిపుణులు అంటున్నారు.

వాస్తవానికి జియో రంగ ప్రవేశానికి ముందు ఒక జీబీ డేటాకు రూ. 200కు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2016లో జియో వచ్చిన తరువాత, డేటా ఖర్చు గణనీయంగా పడిపోయింది. రోజుకు 1 జీబీ ఖర్చు పెట్టినా, నెలకు రూ. 200 కూడా కట్టాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. రిలయన్స్ జియో డేటా, కాల్స్‌ ను ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో ప్రభావానికి ఆర్-కామ్, ఎయిర్‌ సెల్, టాటా డొకొమో, టెలినార్‌ వంటి సంస్థలు మూతపడ్డాయి. మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యాపరంగా నంబర్‌ 1 స్థాయికి చేరుకుంది. జియో దెబ్బకు తట్టుకుని నిలబడాలంటే, విలీనం ఒక్కటే మార్గమని వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ లు కలిసిపోయాయి.

ఇదిలావుండగా, గడచిన 20 ఏళ్ల కాలానికి సంబంధించి రేడియో తరంగాలు, ఇతరత్రా బకాయిల రూపంలో టెలికం సంస్థలు మొత్తం రూ.1.47 లక్షల కోట్లను కేంద్రానికి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌ టెల్‌ రూ. 35 వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 53 వేల కోట్లు కట్టాలి. ఈ భారాన్ని తట్టుకోవాలంటే, చార్జీలను పెంచాల్సిందే. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వస్తాయి. వచ్చే ఏడాది వ్యవధిలో వినియోగదారుడి నుంచి వచ్చే నెలసరి సగటును రెట్టింపు చేసుకోవాలన్న టార్గెట్ తో టెల్కోలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News