BSE: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్... 12 వేల దిగువన నిఫ్టీ, లక్ష కోట్లకు పైగా నష్టం!

  • వీడని కరోనా వైరస్ భయాలు
  • నష్టపోయిన ఆసియా సూచికలు
  • నశించిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • ఒక శాతం నష్టంలో సెన్సెక్స్, నిఫ్టీ
Indian Stock Market Loss

గడచిన మూడు సెషన్లుగా నష్టాల్లో కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్, నేడు కూడా అదే ట్రెండ్ లో పయనిస్తోంది. కరోనా భయాలు వెంటాడుతూ ఉండటం, ఏజీఆర్ చెల్లింపుల అంశం టెలికం కంపెనీల ఈక్విటీలను కుదేలు చేయడం, ఆసియా మార్కెట్ల నష్టాలు వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను కృంగదీశాయి. దీంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 12 వేల పాయింట్ల స్థాయి వద్ద మద్దతును కోల్పోయి దిగజారింది.

ఈ ఉదయం 11.30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ , క్రితం ముగింపుతో పోలిస్తే 375 పాయింట్ల నష్టంతో 40,680 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సూచిక, 116 పాయింట్లు నష్టపోయి 11,929 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. గెయిల్, ఫిన్ సర్వ్, జీ ఎంటర్ టెయిన్ మెంట్స్ తదితర కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. దాదాపు లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది.

ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, నిక్కీ 1.45 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.37 శాతం, హాంగ్ సెంట్ 1.32 శాతం, తైవాన్ వెయిటెడ్ 0.97 శాతం, కోస్పీ 1.57 శాతం, సెట్ కాంపోజిట్ 0.69 శాతం, షాంగై కాంపోజిట్ 0.10 శాతం నష్టపోయాయి.

More Telugu News