Samantha: 'జానూ' ఎఫెక్ట్... శర్వానంద్ పక్కన మరో చిత్రానికి 'నో' చెప్పిన సమంత!

  • తొలుత 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడికి ఓకే చెప్పిన సమంత
  • 'మహా సముద్రం'లో నటించేందుకు రెడీ
  • శర్వానంద్ హీరో అనగానే 'నో'
Samantha Says No to Ajay Bhupati

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'ఆర్‌ఎక్స్ 100' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆపై అజయ్ దర్శకుడిగా బిజీ అవుతాడని అందరూ అనుకున్నా, అది జరగలేదు. తాను రాసుకున్న 'మహాసముద్రం' స్టోరీతో ఎవరి వద్దకు వెళ్లినా, స్క్రిప్ట్ బాగుందని అన్న వారే తప్ప, చేస్తామని ముందుకు వచ్చిన వారు మాత్రం లేరు. హీరోయిన్ గా చేసేందుకు మాత్రం గతంలోనే సమంత అంగీకరించింది.

చివరకు హీరోగా చేసేందుకు శర్వానంద్ ముందుకు రావడంతో లైన్ క్లియర్ అయిందని భావించి, షూటింగ్ ను ప్రారంభించేందుకు అజయ్ భూపతి ముహూర్తం వెతుక్కుంటున్న సమయంలో మరో అవాంతరం వచ్చి పడింది. ఈ చిత్రంలో తాను నటించబోనని సమంత స్పష్టం చేసిందట. ఇటీవల శర్వానంద్‌ తో తాను నటించిన 'జాను' రిజల్ట్స్ దీనికి కారణమని తెలుస్తోంది.

'జానూ' చిత్రానికి ప్రశంసలు లభించినా, ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో వెంటనే శర్వానంద్ తో మరో సినిమా వద్దని సమంత భావించినట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా కోసం 'సమ్మోహనం' ఫేమ్ అదితి రావ్ హైదరీని అజయ్ సంప్రదించినట్టు తెలుస్తోంది.

More Telugu News