Disha App: అర్ధరాత్రి కామాంధుడి బారి నుంచి బాలికను రక్షించిన 'దిశ'!

  • రాయదుర్గం సమీపంలో ఘటన
  • ఉత్సవానికి వెళ్లి వస్తున్న బాలిక అటకాయింపు
  • విజయవాడ కంట్రోల్ రూం నుంచి స్థానిక పోలీసులకు మెసేజ్ 
  • పది నిమిషాల్లో వచ్చిన పోలీసులు, నిందితుడి అరెస్ట్
Girl Rescued after she message DISHA

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దిశ' యాప్ కు వచ్చిన మెసేజ్ ఓ బాలికను కాపాడి, కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలోని గుమ్మఘట్ట మండలం, వీరాపురం తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తండాలో గిరిజనుల ఆరాధ్య దేవుడు సేవాలాల్ జయంతి వేడుకలు శనివారం నాడు వైభవంగా జరిగాయి.

ఈ వేడుకల్లో గ్రామంలోని ప్రజలంతా పాల్గొన్నారు. ఆడిపాడారు. అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో 16 సంవత్సరాల బాలిక, నిద్ర వస్తోందని చెప్పి, పక్క వీధిలో ఉన్న ఇంటికి బయలుదేరింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన తిరుపాల్ నాయక్ (21) ఆమె వెంట పడి, బలవంతం చేశాడు. కోరిక తీర్చాలని వేధించాడు. గట్టిగా కేకలు వేస్తూ, పరిగెత్తిన ఆమె తక్షణ సాయం కోసం 'దిశ'కు మెసేజ్ చేసింది.

ఈలోగా ఆమె చిన్నాన్న ఇంటివైపు వస్తుండటాన్ని చూసిన తిరుపాల్, అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే సమయంలో తమకు అందిన మెసేజ్ ని చూసిన విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి రాయదుర్గం రూరల్ సీఐకి సమాచారం వెళ్లింది. దీంతో ఘటన జరిగిన ప్రాంతాన్ని సెల్ ఫోన్ సిగ్నల్ సాయంతో ట్రాక్ చేసి, పది నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని కలిసి, ఓ ఇంట్లో దాక్కున్న తిరుపాల్ ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టామని వెల్లడించారు.

More Telugu News