Arvind Kejriwal: పారిశుద్ధ్య కార్మికులు, బస్ డ్రైవర్లే వీవీఐపీలు.. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వారే ముఖ్య అతిథులు!

  • 50 మంది ఆమ్ ఆద్మీలను ఆహ్వానించిన కేజ్రీవాల్
  • విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల అమరుల కుటుంబాలకు ఆహ్వానం
  • నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం
Arvind Kejriwal to take oath today

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ప్రమాణ స్వీకారం అనగానే పలువురు వీవీఐపీలతో హడావుడి ఉంటుంది. అయితే, కేజ్రీవాల్ అందుకు భిన్నంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. అత్యంత సామాన్యులైన 50 మంది కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి వీఐపీలుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత మనీశ్ సిసోడియా తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరవుతున్న వారిలో ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు, పాఠశాల ప్యూన్లు, మొహల్లా క్లినిక్ వైద్యులు, బస్ మార్షల్స్, సింగపూర్ బ్రిడ్జి ఆర్కిటెక్‌లు, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపకదళ సిబ్బంది కుటుంబాలు ఉన్నట్టు సిసోడియా తెలిపారు. ఢిల్లీలోని 70 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘ఆప్’ 62 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 8 స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది.

More Telugu News