Drunk Driving: మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన హైదరాబాద్ యువతి!

  • హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • శ్వాస పరీక్షకు సహకరించకుండా యువతి హల్ చల్
  • మహిళా కానిస్టేబుళ్లను పిలిపించి అదుపు చేసిన ట్రాఫిక్ పోలీసులు
Drunk Driving Tests in Hyderabad

నిన్న రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, పూటుగా మద్యం తాగిన ఓ యువతి, బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా నానాయాగీ చేసింది. ఆమెను అదుపు చేసేందుకు పోలీసులు మహిళా కానిస్టేబుళ్లను పిలిపించాల్సి వచ్చింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది.

ఓ కారులో వచ్చిన ఆమె, తొలుత తనను విడిచి పెట్టాలని కోరింది. తనిఖీ తప్పనిసరని పోలీసులు తేల్చి చెప్పడంతో రెచ్చిపోయింది. కారు దిగకుండా మారాం చేసింది. ఈలోపు మీడియా రావడంతో వారిపైనా దుర్భాషలాడింది. అతికష్టం మీద యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిన్న మొత్తం 98 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం 35 కార్లు, 63 బైక్ లను సీజ్ చేశామని, వాటిని నడిపి, పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.


More Telugu News