School Van: పంజాబ్ లో పాఠశాల వ్యాన్ లో మంటలు.. నలుగురు విద్యార్థుల మృతి

  • పాఠశాల నుంచి ఇళ్లకు వస్తోన్న సమయంలో ప్రమాదం
  • వ్యాన్ లో మొత్తం 12 మంది విద్యార్థులు
  • కాపాడబడ్డ 8మంది విద్యార్థులు
Four School Children Burnt Alive after Van Catches Fire

పాఠశాల ముగిసిన తర్వాత వ్యాన్ లో ఇంటికి బయలు దేరిన ఆ విద్యార్థులకు ఆ వ్యానే వారికి మృత్యపాశమైంది. వ్యానులో మంటలు చెలరేగడంతో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులే. మిగతా ఎనిమిది మంది విద్యార్థులు రక్షింపబడ్డారు. వివరాలు  ఇలా ఉన్నాయి. పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలోని లోంగోవాల్-సిద్ సమాచార్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పాఠశాల ముగిసిన అనంతరం 12 మంది విద్యార్థులతో బయలుదేరిన వ్యానులో మార్గమధ్యంలో అకస్మాత్తుగా మంటలు రావడంతో.. డ్రైవర్ అప్రమత్తమై వ్యాను ఆపి పిల్లలను దించడానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఈ లోపే మంటలు అంతటా వ్యాపించాయి. ఎనిమిది మంది విద్యార్థులను వ్యాను నుంచి సురక్షితంగా బయటకు తీసినప్పటికీ.. మరో నలుగురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ.. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపడతామన్నారు. కాగా, పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, వ్యాన్ యజమానిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వ్యాన్ లో 1990 నాటి ఎల్పీజీ కిట్ అమర్చి ఉందని.. అది రోడ్డుపై తిరగడానికి అనువుకాదని వెల్లడించారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు.

More Telugu News