YS Jagan: ప్రత్యేక హోదా, మండలి రద్దు, దిశ చట్టం ఆమోదం... అమిత్ షాకు జగన్ వినతులు!

  • రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి
  • పలు అంశాలపై అమిత్, జగన్ చర్చలు
  • వెంకన్న ప్రతిమ, ప్రసాదాన్ని కానుకగా ఇచ్చిన జగన్
YS Jagan Meeting with Central Home Minister

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టుగా, ప్రత్యేక హోదాను కల్పించాలని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసన మండలి పక్షపాతంతో వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నందున రద్దు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి దాదాపు అరగంటకు పైగా ఆయనతో చర్చలు జరిపిన జగన్, పలు విషయాలను ఆయన ముందుంచారు. మండలిని రద్దు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ, మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీతో సిఫార్సు చేసిందని గుర్తు చేశారు.

శాసన సభ నుంచి పంపిన తీర్మానంపై తదుపరి చర్యలకు న్యాయ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేస్తున్న బిల్లులను అడ్డుకుంటున్న ఆ సభ తమ రాష్ట్రానికి అక్కర్లేదని అన్నారు. నిన్న రాత్రి 9.45 నుంచి అమిత్ షాతో భేటీ అయిన జగన్, ఏపీకి సంబంధించి పలు అంశాలను చర్చించారు.

పోలవరం ప్రగతి, మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, మహిళల రక్షణకు తీసుకుని వచ్చిన దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తదితర అంశాలపై వీరిమధ్య చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో రూ. 838 కోట్లను ఆదా చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేయాలని జగన్ కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర సర్కారు వెచ్చించిన రూ. 3,320 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే సాయాన్ని పెంచాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కూడా జగన్ కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తామన్న నిధులను ఇవ్వలేదని, బుందేల్ ఖండ్, కలహండి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక సహాయం కింద తలసరి రూ. 4 వేలు ఇస్తుంటే, ఏపీలో మాత్రం వివక్ష చూపుతూ రూ. 400 మాత్రమే ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ. 22,949 కోట్లు ఉందని కాగ్ నిర్ధారించిందని, ఈ మొత్తంలోనే ఇంకా కేంద్రం నుంచి రూ. 18,969 కోట్లు రావాల్సి వుందని, ఆ నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే మూడు రాజధానులను ప్రకటించామని, అభివృద్ధితో పాటు పరిపాలన వికేంద్రీకరణే తమ లక్ష్యమని, బీజేపీ తన మ్యానిఫెస్టోలో సైతం కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిందని అమిత్ షాతో జగన్ వ్యాఖ్యానించారు. యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై తక్షణం స్పందించి, సత్వర శిక్షల దిశగా దిశ చట్టాన్ని తీసుకుని వచ్చామని, దానికి ఆమోదం తెలపాలని కోరారు.  హోమ్ మంత్రికి కానుకగా, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ, ప్రసాదాలను జగన్ కానుకలుగా ఇచ్చారు.

More Telugu News