Renu Desai: ఆ ఇల్లు నా మాజీ భర్త కొనిచ్చాడన్నది అవాస్తవం: రేణూ దేశాయ్

  • అకీరా, ఆద్యలకు పవన్ ఇల్లు కొనిచ్చాడంటూ ప్రచారం
  • గచ్చిబౌలీలో రూ.5 కోట్ల విలువైన ఫ్లాట్ అంటూ కథనాలు
  • కష్టపడిన సొమ్ముతో తానే కొనుక్కున్నానని వెల్లడించిన రేణు
Renu Desai condemns rumors

టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రేమకు పర్యాయపదంలా నిలిచిన పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ పరిస్థితులు వారిని విడాకులతో వేరుచేశాయి. వారిద్దరూ అధికారికంగా విడిపోయి ఏళ్లు గడుస్తున్నా, ఇద్దరినీ ప్రస్తావిస్తూ మీడియాలో ఇప్పటికీ కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, పవన్ తన పిల్లలు అకీరా, ఆద్యల కోసం హైదరాబాదు గచ్చిబౌలీలో రూ.5 కోట్ల విలువ చేసే బంగ్లా కొనిచ్చాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని రేణు దేశాయ్ ఖండించారు.

విడిపోయినప్పటి నుంచి తన మాజీ భర్త ద్వారా ఎలాంటి అసంబద్ధమైన భరణాన్ని పొందలేదని, కనీసం తన తండ్రి నుంచి కూడా ఎలాంటి ఆర్థికసాయం పొందలేదని రేణు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఫ్లాట్ కొన్న మాట నిజమేనని, అయితే అది తను కష్టపడిన సొమ్ముతో కొనుక్కున్న ఫ్లాట్ అని వెల్లడించారు.

"నా కష్టార్జితంతో కొన్న ఫ్లాట్ ను నా మాజీ భర్త కొనిచ్చాడని ప్రచారం చేస్తే అది నా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుందని మీకెవరికీ అనిపించలేదా? ఓ మగాడి సాయం లేకుండా జీవితంలో పోరాడుతున్న ఒంటరి తల్లిని నేను. గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి ప్రచారంతో కించపర్చవద్దు. నాకు తెలిసినంతవరకు ఈ వార్తకు, నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. కనీసం ఈ వార్త ఆయన వరకు వెళ్లకపోవచ్చు. కానీ మీడియా సంస్థలు తమ అత్యుత్సాహంతో ఒంటరి స్త్రీల జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సబబో ఆలోచించాలి" అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News