kerala: వంద మొక్కలు నాటండి.. ఐఏఎస్ ఆఫీసర్ కు కేరళ హైకోర్టు శిక్ష

  • ఒక అప్లికేషన్ పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంపై ఆగ్రహం
  • ఎక్కడ మొక్కలు నాటారో, ఏ మొక్కలు నాటారో చెప్పాలని సూచన
  • సదరు ఆఫీసర్ ఆ రాష్ట్ర మంత్రి కుమారుడు
Kerala HC orders IAS officer to plant 100 saplings over delay in hearing application

కేరళలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ కు అక్కడి హైకోర్టు చిత్రమైన శిక్ష వేసింది. ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకున్న అప్పీలుపై తగిన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం, నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ కె.బిజును వంద మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు ఎక్కడెక్కడ, ఏమేం మొక్కలు నాటారన్న వివరాలను కూడా తమకు అందజేయాలని స్పష్టం చేసింది.

ఏం జరిగింది?

కేరళలోని కోల్లాం ప్రాంతానికి చెందిన ఎస్ఎస్ కెమికల్స్ అనే కంపెనీ లైసెన్సు కోసం 2016లో పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుంది. ఇన్నేళ్లయినా దానిపై ఏమీ తేల్చకపోవడంతో ఆ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పరిశ్రమల శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లైసెన్సు ఇస్తారా, లేదా అన్నదానిపై మూడున్నరేళ్లుగా నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ బిజు నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాకుండా పబ్లిక్ ప్రదేశాల్లో వంద మొక్కలు నాటాలని.. ఆ వివరాలను తమకు అందజేయాలని స్పష్టం చేసింది.

ఆ ఆఫీసర్ మంత్రి కుమారుడు

హైకోర్టు మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించిన ఐఏఎస్ ఆఫీసర్ కె.బిజు.. ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి కె.కృష్ణకుట్టి కుమారుడు కావడం గమనార్హం. బిజు 2006 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్.

More Telugu News