Nalgonda District: తన భార్యతో చనువుగా ఉంటున్నాడని మర్డర్ స్కెచ్ వేశాడు!

  • రేవంత్ కుమార్ హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
  • మొత్తం  నలుగురు నిందితుల అరెస్టు
  • దారికాసి చంపేసినట్టు వెల్లడి
man murder case disclosed

పాలుపోసేందుకు వచ్చే వ్యక్తి తన భార్యతో చనువుగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఏకంగా అతన్ని చంపేయాలని నిర్ణయించాడు. లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని మరో ముగ్గురితో కలిసి హత్య చేశాడు. నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెం స్టేజి సమీపంలో ఈ నెల 5న జరిగిన శిరసనగండ్ల రేవంత్ కుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ డీఎస్సీ వెంకటేశ్వరరావు అందించిన వివరాల మేరకు...

పాల వ్యాపారం చేసే రేవంత్ కుమార్ ప్రతిరోజూ హజారిగూడ వెళ్లేవాడు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జానపాటి హరికృష్ణ భార్యతో చనువుగా ఉండేవాడు. దీన్ని వేరే ఉద్దేశంగా హరికృష్ణ భావించేవాడు. ఈ కారణంగా తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. అయినా భార్య తీరు మార్చుకోకపోవడంతో రేవంత్ కుమార్‌ను చంపేయాలనుకున్నాడు. విషయాన్ని తమ్ముడు రామాంజనేయులతో చర్చించాడు.

అతని సాయంతో సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్ ను కలిసి మాట్లాడారు. లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మూడు సార్లు హత్యాయత్నం చేసినా ఫలించలేదు. దీంతో ఈనెల 5వ తేదీన నలుగురూ హజారిగూడెం స్టేజ్ సమీపంలోని పొదల్లో దాక్కున్నారు.

పాలకోసం వెళ్తున్న రేవంత్ కుమార్ తన ద్విచక్ర వాహనంపై అక్కడికి రాగానే అడ్డుకుని ఒక్కసారిగా అతనిపై పడ్డారు. ఇనుపరాడ్లు, కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న నిందితులను అరెస్టు చేశారు.

More Telugu News