Hyderabad: నేరస్తుడు మారిపోయాడనుకున్న పోలీసులకు షాక్.. మహిళపై అత్యాచారం కేసులో వెలుగులోకి కొత్త విషయం!

  • మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో మహిళపై అత్యాచారం
  • నిందితుల్లో ఒకడు మారిపోయాడని భావిస్తున్న పాత నేరగాడు
  • విషయం తెలిసి విస్తుపోయిన పోలీసులు
telangana police shocked to see the accused in zaheerabad rape case

నేరస్తుల్లో మార్పు తెచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కాకపోతే వచ్చినట్టు నటిస్తున్నారంతే. మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో జరిగిన ఘటన ఇందుకు ఊతం ఇస్తోంది. పోలీసుల పేరుతో ఓ మహిళను బస్సు నుంచి దించి అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకడు మారిపోయాడని పోలీసులు భావిస్తున్న వ్యక్తే కావడం గమనార్హం.

వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన కె.వీరబ్రహ్మచారి పదో తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టాడు. మావోయిస్టుల పేరుతో దందాకు తెరలేపాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలోనూ మావోల పేరుతో ధనవంతుల నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం 2005లో హయత్‌నగర్‌లో ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో 2012లో వీరబ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతడిపై 32 కేసులు ఉన్నాయి. ఈ కేసులో అతడికి ఐదేళ్ల శిక్ష పడింది.

శిక్ష పూర్తయిన తర్వాత జైలు నుంచి విడుదలైన వీరబ్రహ్మచారి 2015లో సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిసి బతుకుదెరువు కోసం తనకో దారి చూపించమని వేడుకున్నాడు. దీంతో చర్లపల్లి జైలు అధికారులతో మాట్లాడిన సీపీ స్వయం ఉపాధి కోసం ఉప్పల్ రింగ్‌రోడ్డులో టీ పాయింట్‌ పెట్టించారు. అప్పటి డీసీపీ నవీన్ కుమార్ 2015లో రిబ్బన్ కట్ ‌చేసి టీ పాయింట్‌ను ప్రారంభించారు. స్వయం ఉపాధితో అతడు తన నేరప్రవృత్తిని వదిలి అందరిలా ఆనందంగా బతకాలని ఈ సందర్భంగా డీసీపీ సూచించారు.

టీపాయింట్ పెట్టిన తర్వాత వీరబ్రహ్మచారి మారిపోయాడని పోలీసులు భావించారు. రోడ్డు విస్తరణలో భాగంగా అతడి టీపాయింట్ మారిపోకుండా చూసుకున్నారు. అయితే, ఇటీవల అర్ధరాత్రి వరకు టీ డబ్బా నడుపుతుండడంతో ఉప్పల్ పోలీసులు పీటీ కేసు నమోదు చేశారు. ఇటీవల వేరే వాళ్లతో టీ పాయింట్ నడిపిస్తున్న వీరబ్రహ్మం.. గత వారం రోజులుగా కనిపించడం లేదు.

తాజాగా, మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో పోలీసుల పేరుతో ఓ బస్సును ఆపిన దుండగులు ఓ ప్రయాణికురాలి సంచిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ ఆమెను బస్సు నుంచి బలవంతంగా దించారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల్లో ఒకడు వీరబ్రహ్మచారి కూడా ఉన్నట్టు తెలుసుకుని విస్తుపోయారు.

More Telugu News