Gorantla Butchaiah Chowdary: 'పిచ్చోడి చేతిలో ఏకే-47 పెడితే జరిగేదేంటి?' అంటూ జగన్ పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు

  • వీడి చేతికి 151 ఏకే 47 లు ఇచ్చారు
  • అమరావతిని రాజధానిగా వద్దనుకునేది ఎవరు?
  • మూడు రాజధానుల ఆలోచన పనికిమాలింది

అమరావతి రైతుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఉందని, వారికి అండగా ఉన్నామని చెప్పేందుకే వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తుళ్లూరులో రైతుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో గొప్ప చరిత్ర ఉన్న అమరావతిని రాజధానిగా వద్దనుకునే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నిస్తూ సీఎం జగన్, వైసీపీ నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

రైతుల త్యాగాలు వృథా చేసే పద్ధతి మంచిది కాదని అన్నారు. విశాఖతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అన్నారు. రాజమండ్రి నుంచి వెళితే తప్ప విశాఖలో నీళ్లు లేవని, ట్యాంకర్ల ద్వారా సప్లయ్ చేసే పరిస్థితి అక్కడ నెలకొని ఉందని అన్నారు.
అమరావతిలో నీటి ఎద్దడి లేదని ఈ సందర్భంగా తెలిపారు. అన్ని రైల్వే లైన్లు విజయవాడ నుంచే వెళతాయని, రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేని ప్రాంతమని అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదు

మూడు రాజధానుల ఆలోచన పనికిమాలినదని, ఒక అరాచకవాది ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయి విసిరితే ఒకడికే తగులుతుందని, కానీ, ‘వీడి చేతికి 151 ఏకే 47 లు ఇచ్చారు. పిచ్చి వాడి చేతిలో ఏకే-47 పెడితే జరిగేదేంటి? ఇష్టమొచ్చినట్టు కాల్చేస్తాడు’ అంటూ జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి భయంకరమైన పరిపాలన ఎక్కడా చూడలేదని, మహిళలపై పోలీసులు దాడులు చేయడం దారుణమని అన్నారు. తన తాత దగ్గర నుంచి జగన్ వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు అలవాటని, ఎంతోమందిని బలి తీసుకున్న చరిత్ర వారిదని, ఈరోజు ప్రజలనే ఉరితీసే పరిస్థితికి ఈ పెద్ద మనిషి వచ్చాడు’ అంటూ జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.

More Telugu News