Kumaraswami: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ నిశ్చితార్థం

  • వేడుకగా జరుగనున్న నిశ్చితార్థం
  • సుమారు 4 వేల మందికి ఆహ్వానం
  • పెళ్లిని వైభవంగా జరిపిస్తానన్న కుమారస్వామి

అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో తానేంటో నిరూపించుకున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం నేడు జరుగనుంది. ఈ విషయాన్ని మీడియాకు స్వయంగా వెల్లడించిన కుమారస్వామి, సోమవారం నాడు తాజ్ వెస్టెండ్ హోటల్ లో వేడుకగా ఎంగేజ్ మెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిఖిల్ నిశ్చితార్థం రేవతితో జరుగనుందని తెలిపారు. ఈ పెళ్లిని తాను చాలా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నానని, నటుడుగా, రాజకీయ నేతగా తన కుమారుడిని ఆశీర్వదించిన అందరినీ ఆహ్వానిస్తానని తెలిపారు.

నిశ్చితార్థ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు దాదాపు 4 వేల మంది హాజరవుతారని భావిస్తున్నట్టు కుమారస్వామి తెలియజేశారు. పెళ్లి రామనగర - చెన్నపట్టణ మధ్య జరుగుతుందని అన్నారు. కాగా, నిఖిల్ గౌడ 'జాగ్వార్' చిత్రంలో హీరోగా సందడి చేసిన సంగతి తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో మాత్రం మాండ్యా నుంచి జేడీఎస్ తరఫున బరిలోకి దిగి, ఇండిపెండెంట్ గా నిలిచిన నటి సుమలత చేతిలో ఓడిపోయారు.

More Telugu News