Ashok Babu: ఎవరినీ కలవని జగన్ ఎక్కడ ఉన్నా ఒకటే!: అశోక్ బాబు

  • అమరావతి ప్రజల నిరసనలకు అశోక్ బాబు మద్దతు
  • రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడి
  • అంతిమ విజయం తమదేనంటూ వ్యాఖ్యలు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న నిరసనలకు ఎమ్మెల్సీ అశోక్ బాబు మద్దతు తెలిపారు. అమరావతి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా అంతిమంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది 29 గ్రామాల ఉద్యమం అని ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్ర రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే మండలి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపామని, మండలిలో తమకు మెజారిటీ ఉంది కాబట్టే అన్యాయాన్ని అడ్డుకున్నామని తెలిపారు. సీఎం జగన్ పై స్పందిస్తూ, ఎవరినీ కలవని జగన్ ఎక్కడున్నా ఒకటేనని విమర్శించారు. ఈ నెల 11న టీడీపీ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

More Telugu News