Vizag: విశాఖలో అతి దారుణం.. వీధుల్లో మహిళను ఏడుగురు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన వైనం

  • కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన
  • ఇంట్లో బాధితురాలి భర్తలేని సమయంలో ఏడుగురి దాడి
  • రక్షించాలని అరిచినా కాపాడని స్థానికులు

విశాఖ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధుల్లో అందరూ చూస్తుండగా ఓ మహిళను ఏడుగురు వ్యక్తులు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణ ఘటన జరిగింది. దాదాపు అర కిలోమీటరు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినప్పటికీ ఎవరూ ఈ చర్యను అడ్డుకోలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. గుత్తి లక్ష్మి (35) అనే మహిళ ఎల్లపువానిపాలెం గ్రామంలో భర్త, పిల్లలతో కలిసి రెంటుకు ఉంటోంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఆమె భర్తలేని సమయంలో నగరానికి చెందిన ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కారులో వచ్చి, లక్ష్మిపై దాడి చేశారు.

వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్తుండగా, తనను రక్షించమని స్థానికులను ఆమె వేడుకుంది. అయినప్పటికీ ఎవరు కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. లక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. ఆమెపై ఎందుకు దాడి చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News