APSRTC: ఏపీఎస్ ఆర్టీసీకి 698 కొత్త బస్సులు... రూ. 1000 కోట్లు శాంక్షన్ చేసిన జగన్!

  • కాలం చెల్లిన బస్ లను తొలగించాలని నిర్ణయం
  • 18 వోల్వో, 50 ఇంద్ర బస్ లను కొనాలని నిర్ణయం
  • పాడైపోయిన బస్ బాడీ యూనిట్ల మార్పు
  • ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాల కల్పనకేనంటున్న అధికారులు

ఏపీఎస్ ఆర్టీసీకి కొత్త బస్సుల కళ రానుంది. కాలం చెల్లిన బస్ లను క్రమంగా తొలగించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, కొత్త బస్సుల కొనుగోలుకు రూ. 1000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో ఈ నెలలోనే మొత్తం 698 బస్సులను కొనుగోలు చేయనున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 18 వోల్వో, 50 ఇంద్ర, 630 నాన్ ఏసీ బస్సులను కొనుగోలు చేయనున్నామని, పాడైపోయిన బస్ బాడీ యూనిట్లను మార్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని తెలిపారు.

ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోను 90 శాతానికి పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందే రూ. 1,572 కోట్లను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీసీలో 27 వెన్నెల స్లీపర్, 58 అమరావతి బస్సులు నడుస్తుండగా, మరో 18 మల్టీ యాక్సిల్ వోల్వో బస్సులు అమరావతి సర్వీసులుగా ప్రయాణికులకు సేవలందించేందుకు రానున్నాయి. వీటితో పాటు గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, పట్టణ ప్రాంతాల్లో నడుస్తున్న ఏసీ బస్సులను కలిపితే, 230 వరకూ బస్సులను ఆర్టీసీ కలిగివుంది.

More Telugu News