Kohli: సైనీ ఇంత బాగా బ్యాటింగ్ చేస్తాడని మాకు తెలియదు: కోహ్లీ

  • రెండో వన్డేలో బ్యాట్ తోనూ ఆకట్టుకున్న సైనీ 
  • బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చి 45 పరుగులు చేసిన వైనం 
  • 5 ఫోర్లు, 2 సిక్సులతో విధ్వంసం  

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో పరాజయం పాలైన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. కివీస్ తో జరిగిన రెండు వన్డేలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయని, ఈ రెండు మ్యాచ్ లలో తాము చివరి వరకు పోరాడామని చెప్పాడు. ప్రథమార్థంలో కొన్ని అవకాశాలు జారవిడిచామని, ఎంతో ప్రతికూల పరిస్థితిలో సైతం జడేజా, సైనీ ఆడిన తీరు అద్వితీయమని పేర్కొన్నాడు.

ముఖ్యంగా, సైనీ బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడని తమకు తెలియదని వెల్లడించాడు. మైదానంలో జడేజా, సైనీ జోడీ ఆడుతున్నప్పుడు వారికి డ్రెస్సింగ్ రూం నుంచి ఎలాంటి సందేశం పంపలేదని, పరిస్థితులకు అనుగుణంగా ఎలా స్పందించాలన్న విషయం తాము ఆటగాళ్ల వ్యక్తిగతానికే వదిలేశామని చెప్పాడు. ఇప్పుడిక సిరీస్ చేజారిన నేపథ్యంలో, తాము కోల్పోయేదేమీ ఉండదని, అందుకే చివరి వన్డేలో మార్పులపై దృష్టిపెడతామని వివరించాడు.

కాగా ఆక్లాండ్ లో ఇవాళ జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ నవదీప్ సైనీ లోయరార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి 45 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 5 ఫోర్లు, 2 సిక్సులు బాది న్యూజిలాండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.

More Telugu News