mascot: దేశంకాని దేశంలో ఈతి బాధలు...ఉపాధి వెతుక్కుంటూ వెళ్లి మస్కట్ లో చిక్కుకున్న మహిళలు!

  • అంతా చిత్తూరు జిల్లా వాసులు 
  • కంపెనీ జీతాలు చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు 
  • భారత రాయబార కార్యాలయానికి చేరిక

ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిన మహిళలు అక్కడ ఎదురైన పరిస్థితిలో చేతిలో చిల్లిగవ్వలేక, అర్ధాకలితో జీవించలేక తిరిగి స్వదేశం వచ్చేందుకు ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దేశంకాని దేశంలో తమ ఈతిబాధలను వివరిస్తూ తమ బంధువులకు ఓ వీడియోను పంపారు. 

ఈ వీడియో మేరకు వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం కమ్మపల్లికి చెందిన రాజమ్మ, ఢిల్లీరాణి, సదుం మండలానికి చెందిన విజయ్ తోపాటు మరికొందరు ఉద్యోగం వెతుక్కుంటూ మస్కట్ వెళ్లారు. అక్కడ వివిధ పనుల్లో చేరారు. అయితే పది నెలలైనా కంపెనీలు రూపాయి కూడా చెల్లించకపోవడంతో వీరు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో యజమానుల నుంచి తప్పించుకుని ఆ దేశంలోని భారతీయ రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. కాకపోతే అక్కడి అధికారులు తమను పట్టించుకోలేదని, పాస్ పోర్టు వచ్చే వరకు అక్కడే ఉండాలని సూచించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాము స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More Telugu News