Delhi Elections: నా సిక్స్త్ సెన్స్ ఏం చెబుతోందంటే..!: ఓటు వేసిన అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్

  • ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోంది
  • 50 సీట్లకు పైగా గెలుస్తాం
  • ఒక మంచి వ్యక్తి సీఎం అవుతారు

ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్, భోజ్ పురి సినీ హీరో మనోజ్ తివారి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందని అన్నారు.

తన నాయకత్వంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయబోతోందని చెప్పారు. తనకు తన తల్లి, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని అన్నారు. జనవరి 1న తన పుట్టినరోజు కోసం వారణాసి నుంచి తన తల్లి ఢిల్లీకి వచ్చారని, ఆమె ఉపవాసదీక్షలో ఉన్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తన నాయకత్వంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి అని చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మొత్తం ఎన్ని సీట్లను బీజేపీ గెలుచుకోబోతోందనే మీడియా ప్రశ్నకు సమాధానంగా... 50 సీట్లకు పైగా కైవసం చేసుకుంటామని మనోజ్ తివారి ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎవరవుతారనే ప్రశ్నకు సమాధానంగా... ఎవరో ఒకరు, ఒక మంచి వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించినా... మనోజ్ తివారి స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వలేదు.

More Telugu News