New Delhi: ఢిల్లీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా ఎస్ఐని కాల్చిచంపిన యువకుడు!

  • ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ పారిశ్రామికవాడలో ఘటన
  • మూడు రౌండ్ల కాల్పులు జరిపిన యువకుడు
  • ఎన్నికల వేళ కలకలం రేపిన హత్య

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణ హత్యకు గురైంది. ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ పారిశ్రామికవాడలో 26 ఏళ్ల ప్రీతి అహల్వాత్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తోంది. నిన్న రాత్రి ఆమె డ్యూటీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనుకగా వచ్చిన ఓ యువకుడు తుపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రెండు తూటాలు ఆమె శరీరంలోకి దూసుకెళ్లి ఛిద్రం చేశాయి. మరోటి సమీపంలో ఉన్న కారు అద్దాలను తాకి ధ్వంసం చేసింది.

తీవ్రంగా గాయపడిన ప్రీతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం వేట ప్రారంభించారు.

కాగా, ఎస్ఐ అహల్వాత్ ప్రస్తుతం ఓ అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తోందనీ, కేసులో నిందితుడు ఆమెను ఇప్పటికే బెదిరించాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ హత్య జరగడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

More Telugu News