Varla Ramaiah: పనికిమాలిన ఎంపీ! నీకు ఇక్కడేం పని?: జీవీఎల్ పై వర్ల ఫైర్

  • యూపీ తరఫున రాజ్యసభకు వెళ్లావంటూ వ్యాఖ్యలు
  • నీకు ఏపీలో ఏంపని అంటూ జీవీఎల్ పై ఆగ్రహం
  • యూపీ సీఎం కన్నెర్ర చేస్తే పారిపోతావని ఎద్దేవా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. "నీకెందుకు ఏపీ సంగతులు? నువ్వు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లావు. అక్కడ 84  మంది ఎంపీలున్నారు. దేశంలో అదో పెద్ద రాష్ట్రం. వాళ్లే మూడు రాజధానులు అడగడంలేదు. కానీ ఇక్కడ ఏపీలో మూడు రాజధానులు కరెక్టా! అలాగైతే యూపీలో 12 రాజధానులు ఏర్పాటు చేయగలవా? మీ సీఎంను అడగ్గలవా? అక్కడేం నోరెత్తలేవు. అక్కడి సీఎం కన్నెర్ర చేస్తే పారిపోతావు. రాజ్యసభలో నువ్వు ఒక్క ప్రశ్నయినా యూపీ గురించి అడిగావా? ఈమధ్య ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైసీపీ ముఖ్య నేతను మీరు ఎందుకు కలవాల్సి వచ్చింది? తినేదేమో బీజేపీ కూడు.. పాడేది వైసీపీ పాట! 

ఇక్కడికొచ్చి కన్నా లక్ష్మీనారాయణను కించపరిచేట్టు మాట్లాడుతున్నావు. ఏపీ సీఎం వద్దకు వెళ్లి నింపాదిగా బయటికి వచ్చేస్తున్నావు. లోపల ఏం జరిగిందో చెప్పాలి. కన్నా లేకుండా మీరు నేరుగా సీఎం వద్దకు ఎలా వెళతారు? మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కూడా తప్పుబట్టారు కదా. ఆయన మాటలకు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? చేతనైతే మీకు రాజ్యసభ పదవి అందించిన రాష్ట్రానికి సేవలు అందించండి. ఇది కరెక్ట్ కాదు జీవీఎల్ గారు!

అప్పుడో టీవీ చానల్ లో సీఎం రమేశ్ మీ నోరు మూయించారు. 'మీ బతుకంతా నాకు తెలుసు' అని సీఎం రమేశ్ అంటే మీరు కుక్కిన పేనులా ఉన్నారు. ఆ రోజున నేను కూడా ఆ టీవీ చానల్ చూశాను, సీఎం రమేశ్ దెబ్బకు మీ ముఖంలో ఆ సమయంలో భయం కనిపించింది. సీఎం రమేశ్ ఎక్కడ బయటపెడతాడోనని భయపడిపోయారు. ఎందుకా భయం?

ఇక్కడి రైతులు మండుటెండలో ధర్నాలు చేస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చి మూడు రాజధానులు కరెక్ట్ అంటావా? దమ్ముంటే మీ ఉత్తరప్రదేశ్ లో 12 రాజధానులు పెట్టు అప్పుడు నువ్వు మగాడివని ఒప్పుకుంటా. పనికిమాలిన ఎంపీ! అర్థంపర్థం లేకుండా మాట్లాడుతూ మా రాష్ట్రంలో చిచ్చుపెడతావా? వచ్చినవాడివి ఇక్కడి బీజేపీ చీఫ్ కన్నాతో మాట్లాడుకుని ఏం --చేయాలో నిర్ణయించుకోవాలే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఎంతోమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్లెలా ఉన్నారు? నువ్వెలా మాట్లాడుతున్నావు? రాష్ట్రానికి మీరు రావడాన్ని మేం తప్పుబట్టడంలేదు. కానీ అవమానించేలా మాట్లాడొద్దు" అంటూ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.

More Telugu News