Hyundai: కార్ల తయారీని నిలిపివేసిన హ్యుందాయ్... కారణం కరోనా వైరస్!

  • సౌత్ కొరియాలో ప్లాంట్ల షట్ డౌన్
  • విడిభాగాల దిగుమతి లేకనే
  • ఐదు రోజుల మూసివేత నష్టం 500 మిలియన్ డాలర్లు

ప్రపంచంలోనే అత్యధికంగా కార్లను తయారు చేస్తున్న సౌత్ కొరియా దిగ్గజం హ్యందాయ్, తన ప్లాంటులో ప్రొడక్షన్ ను నిలిపివేసింది. సాలీనా 14 లక్షల కార్లను తయారు చేసే ఐదు ప్లాంట్ల నెట్ వర్క్ ను ఉల్సాన్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న సంస్థ కరోనా వైరస్ భయంతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. సౌత్ కొరియా తీర ప్రాంతంలో ఉన్న ఈ కర్మాగారానికి విడి భాగాలను దిగుమతి చేసుకునే సంస్థ, ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది.

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కారణంగా, విడి భాగాల దిగుమతికి అవరోధాలు ఏర్పడ్డాయి. చైనాలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ఇప్పటికే ఎన్నో వాహన కంపెనీలు మూత పడ్డాయి. దీంతో తమ ఫ్యాక్టరీలను మూసివేయడంతో పాటు, 25 వేల మంది కార్మికులను సెలవుపై పంపినట్టు స్పష్టం చేసింది. తిరిగి ప్లాంటును తెరిచేంత వరకూ కార్మికులకు కొంత వేతనాన్ని చెల్లిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఇక హ్యుందాయ్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా, ఐదు రోజుల పాటు హ్యుందాయ్ ప్లాంట్లు మూతపడితే 500 మిలియన్ డాలర్ల నష్టం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మరో సౌత్ కొరియా వాహన సంస్థ కియా, తన ప్రొడక్షన్ ను నిలిపివేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రినాల్ట్, ఫియట్ క్రిస్లర్ తదితర సంస్థలు కూడా ఇదే నిర్ణయాన్ని నేడో, రేపో ప్రకటించనున్నాయి.

More Telugu News