Corona Virus: కరోనా వైరస్ మృతులు 24 వేలకు పైగానే?.. చైనాలోని ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ వెల్లడి!

  • 1,54,023 మందికి వైరస్ సోకింది
  • 24,589 మంది మరణించారని వెల్లడించిన టెన్సెంట్
  • ఆ తర్వాత గణాంకాలను మార్చిన వెబ్ సైట్

కరోనా వైరస్ దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే చైనాలోని ప్రధాన నగరాల రహదారులన్నీ కర్ఫ్యూ విధించినట్టుగా ఖాళీగా ఉంటున్నాయి. జనాలెవరూ తమ ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. వైరస్ కారణంగా 564 మంది చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది.

 కానీ, చెనాలో అతి పెద్ద ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్ 'టెన్సెంట్' భయంకర నిజాన్ని వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ 1,54,023 మందికి సోకిందని... వీరిలో 24,589 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో, చైనాలో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత ఆ వెబ్ సైట్ తన గణాంకాలను మార్చింది. 14,4456 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 304 మంది చనిపోయారని తెలిపింది.

టెన్సెంట్ తన గణాంకాలను మార్చినా ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. టెన్సెంట్ కచ్చితమైన వివరాలనే వెల్లడించిందని... ప్రభుత్వ హెచ్చరికలతో గణాంకాలను మార్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, చైనాలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. వూహాన్ లోనే లక్ష నుంచి 3.5 లక్షల వరకు దీని బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని భావిస్తున్నారు. వూహాన్ నుంచి ఈ వైరస్ దేశంలోని నలుమూలలకు వ్యాపించింది. చైనాలో పరిస్థితి అదుపులో లేదని... వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News