CPI Narayana: మోదీ, షాలకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు!: ఏపీ పరిణామాలపై సీపీఐ నారాయణ

  • జీవీఎల్ జగన్ ఏజెంట్
  • బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నాయి
  • హైకోర్టును ఎక్కడైనా పెట్టుకోండి అభ్యంతరం లేదు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి విషయంలో జీవీఎల్ చేస్తున్న ప్రకటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్టణం జిల్లా నర్సీపట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నాయని, అదేదో లీగల్‌గా చేస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో మరో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని మండిపడ్డారు.  

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదన్నారు. మూడు రాజధానులపై నారాయణ మాట్లాడుతూ.. హైకోర్టు ఎక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ సచివాలయం, అసెంబ్లీ మాత్రం ఒక్క చోటే ఉండాలని తేల్చిచెప్పారు.

More Telugu News