Nallmala forest: నల్లమల అడవిలో మహారాష్ట్ర మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు!

  • అక్కమహాదేవి గుహల సమీపంలో మహిళ దారుణ హత్య
  • అత్యాచారం చేసి హత్య చేసిన సాధువు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని అక్కమహాదేవి గుహల సమీపంలో ఈ నెల 2న హత్యకు గురైన మహారాష్ట్ర మహిళ (52) కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన ఓ సాధువు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతంలోని అక్కమహాదేవి గుహలకు చేరుకునే మార్గంలో ఈ నెల 2న ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో దీనిని నరబలిగా అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మహిళ మృతదేహం పక్కనే పడివున్న ఆధార్‌కార్డును బట్టి ఆమె మహారాష్ట్రలోని థానే వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతి వెళ్తున్నట్టు చెప్పి జనవరి 25న ఆమె ఇంటి నుంచి వెళ్లినట్టు వారు చెప్పారు. దీంతో ఆమె మొబైల్ నంబరు సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఎక్కడెక్కడికి వెళ్లిందో ఆరా తీశారు. అలాగే, సీసీటీవీ ఫుటేజీలనూ పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారం లభ్యమైంది. తమిళనాడుకు చెందిన రామకృష్ణ అలియాస్‌ మట్టస్వామి అనే సాధువుతో కలిసి వెళ్లినట్లు గుర్తించి నిన్న అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు వాంగ్మూలమిచ్చాడని పోలీసులు తెలిపారు.

More Telugu News